"మేము ఈ 58 ఒంటెలను జప్తు చేయలేదు" అని అమరావతి జిల్లాలోని తాలేగావ్ దశసర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అజయ్ అకరే చెప్పారు. "ఈ జంతువులపై క్రూరత్వానికి వ్యతిరేకంగా మహారాష్ట్రలో నిర్దిష్ట చట్టం లేదు కాబట్టి మాకు అలా చేసే అధికారం లేదు."

"ఈ ఒంటెలు నిర్బంధంలో ఉన్నాయి" అని ఆయన చెప్పారు.

అలాగే ఈ ఒంటెలను సంరక్షించే వారిలో అమరావతిలోని స్థానిక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌ తప్ప, మిగిలిన వారు కూడా నిర్బంధంలో ఉంచారు.  ఈ ఐదుగురు కాపలాదారులు పాక్షిక సంచార పశుపోషకులు. ఇందులో నలుగురు రబారీ వర్గానికి చెందినవారైతే ఒకరు మాత్రం గుజరాత్‌లోని కచ్ఛ్‌కు చెందిన ఫకీరాణి జాట్ వర్గానికి చెందిన వాడు. ఈ రెండు సామాజిక సమూహాలు తరతరాలుగా, కొన్ని శతాబ్దాలుగా సాంప్రదాయ ఒంటెల కాపరులుగా ఉన్నాయి. 'జంతు హక్కుల కార్యకర్తల' ఫిర్యాదుపై పోలీసులు అరెస్టు చేసిన తర్వాత మెజిస్ట్రేట్ ఐదుగురికి తక్షణ, షరతులు లేని బెయిల్ మంజూరు చేశారు.

"నిందితుల వద్ద, ఒంటెల కొనుగోలు గురించి కానీ వాటి స్వంతదారు అని చెప్పడానికి గాని, వారి స్వంత నివాసానికి గాని సంబంధించిన చట్టపరమైన కాగితాలు లేవు," అని అకరే చెప్పారు. కాబట్టి, సాంప్రదాయ పశువుల కాపరులు ఒంటెల కోసం ID కార్డులు, వాటి యాజమాన్య పత్రాలను కోర్టుకు సమర్పించాల్సిన ఆసక్తికరమైన పరిస్థితి వచ్చింది. వీటిని, వారి బంధువులు, ఈ రెండు సంచార పశుకాపరుల సమూహాలకు చెందిన ఇతర సభ్యులు పంపారు.

తమ పశువుల కాపరుల నుండి విడిపోయి, ఒంటెలు ఇప్పుడు గౌరక్షా కేంద్రం లో, అంటే గోవుల ఆశ్రయ గృహంలో, వాటిని సంరక్షించడం లేక పోషించడం గురించి ఏమి తెలియని వ్యక్తుల అదుపులో ఉన్నాయి. ఒంటెలు, ఆవులు చాలా భిన్నమైన ఆహారాన్నితింటాయి. కేసు ఇంకా కొనసాగితే గోశాలలో ఒంటెల పరిస్థితి వేగంగా క్షీణించే అవకాశం ఉంది.

Rabari pastoralists camping in Amravati to help secure the release of the detained camels and their herders
PHOTO • Jaideep Hardikar

నిర్బంధించబడిన ఒంటెలను, వాటి పశువుల కాపరుల వద్ద చేర్చేందుకు, సహాయానికి అమరావతిలో విడిది చేసిన రబారీ పశువుల కాపరులు

*****

ఒంటె రాజస్థాన్ రాష్ట్ర జంతువు, అది ఇతర రాష్ట్రాల్లో జీవించలేడు.
జస్రాజ్ శ్రీశ్రీమల్, భారతీయ ప్రాణి మిత్ర సంఘం, హైదరాబాద్

ఇదంతా తీవ్ర అనుమానంతో మొదలైంది.

జనవరి 7, 2022న, హైదరాబాద్‌కు చెందిన జంతు సంక్షేమ కార్యకర్త జస్‌రాజ్ శ్రీశ్రీమల్ (71), ఐదుగురు పశువుల కాపరులు హైదరాబాద్‌లోని కబేళాలకు ఒంటెలను అక్రమంగా తరలిస్తున్నారని తలేగావ్ దశసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే ఆ వ్యక్తులను, వారి ఒంటెలను అదుపులోకి తీసుకున్నారు. శ్రీశ్రీమల్ అయితే, హైదరాబాద్‌లో కాకుండా మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో పశువుల కాపరులను ఎదుర్కొన్నాడు.

“నేను ఒక సహోద్యోగితో కలిసి చండూర్ రైల్వే తహసీల్‌లోని అమరావతికి బయలుదేరి, నిమ్‌గవాన్ గ్రామానికి చేరుకున్నాను, అక్కడ నలుగురైదుగురు వ్యక్తులు పొలంలో ఒంటెలతో విడిది చేశారు. మొత్తం లెక్కిస్తే 58 ఒంటెలు ఉన్నాయని తెలిసింది. వాటి మెడను,  కాళ్ళను కట్టివేశారు, అందువలన అవి సరిగ్గా నడవలేకపోయాయి. వీరు వాటి పట్ల క్రూరంగా ప్రవర్తించారు. ఇందులో కొన్నిటికి గాయాలైనాగాని, ఈ పశువుల కాపరులు వాటికి ఎటువంటి మందులు వేయలేదు. ఒంటె రాజస్థాన్ రాష్ట్ర జంతువు, ఇది ఇతర రాష్ట్రాల్లో జీవించలేదు. వీరి వద్ద ఎటువంటి పత్రాలు లేవు. వారు ఒంటెలను ఎక్కడికి తీసుకెళ్తున్నారో స్పష్టం చేయలేకపోయారు,” అని శ్రీశ్రీమల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

వాస్తవానికి, భారతదేశంలోని ఒంటెలు రాజస్థాన్, గుజరాత్, హర్యాణా రాష్ట్రాలలో కనిపిస్తాయి. మనం వీటిని మరికొన్ని ప్రదేశాలలో కూడా చూడవచ్చు. అయితే, వీటి పెంపకం మాత్రం రాజస్థాన్, గుజరాత్‌ రాష్ట్రాలకే పరిమితమై ఉంది. 20వ లైవ్‌స్టాక్ సెన్సస్ - 2019 ప్రకారం దేశంలోని మొత్తం ఒంటెల జనాభా కేవలం 250,000 మాత్రమే. 2012లో పశువుల గణనలో వాటి సంఖ్యతో పోలిస్తే ఇది 37 శాతం తగ్గుదల.

The camels, all male and between two and five years in age, are in the custody of a cow shelter in Amravati city
PHOTO • Jaideep Hardikar

రెండు నుంచి ఐదేళ్లలోపు ఉన్న మగ ఒంటెలన్నీ అమరావతి నగరంలోని ఓ గోశాల అదుపులో ఉన్నాయి

పెద్ద జంతువుల రవాణాలో నైపుణ్యం, అనుభవం ఉన్న ఈ ఐదుగురు పశువుల కాపరులు కచ్ఛ్‌కు చెందినవారే. వాళ్లెప్పుడూ హైదరాబాద్‌కు వెళ్లలేదు.

"నాకు వీరి నుండి స్పష్టమైన సమాధానాలు రాలేదు, అందువలన అనుమానం వచ్చింది," అని శ్రీశ్రీమల్ హైదరాబాద్ నుండి టెలిఫోన్ ద్వారా PARI కి చెప్పారు. "అక్రమ ఒంటె వధ కేసులు పెరుగుతున్నాయి," అని అతను చెప్పాడు, తన సంస్థ - భారతీయ ప్రాణి మిత్ర సంఘ్ - భారతదేశం అంతటా ఐదు సంవత్సరాలలో 600 ఒంటెలను రక్షించింది.

గుల్బర్గా, బెంగళూరు, అకోలా, హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలలో ఇలా ప్రభావవంతంగా రక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అతని సంస్థ 'రక్షించబడిన' జంతువులను, రాజస్థాన్‌కు 'బహిష్కరించింది'. హైదరాబాద్, భారతదేశంలోని ఇతర కేంద్రాలలో ఒంటె మాంసానికి డిమాండ్ పెరుగుతోందని ఆయన చెప్పారు. అయితే పాత మగ ఒంటెలను మాత్రమే వధకు విక్రయిస్తున్నారని పరిశోధకులు, వ్యాపారులు చెబుతున్నారు.

పీపుల్ ఫర్ యానిమల్స్ సంస్థకు నాయకత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఎంపీ మరియు మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీతో శ్రీశ్రీమల్ కు దగ్గరి సంబంధం ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో గాంధీని ఉటంకిస్తూ , “ఒక పెద్ద రాకెట్ ఉంది, ఈ సిండికేట్ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ నుండి నడుస్తుంది. ఒంటెలను బంగ్లాదేశ్‌కు కూడా తీసుకువెళతారు. ఇన్ని ఒంటెలు ఒకేచోట కలిసి ఉండే ప్రశ్నే లేదు.” అన్నారు.

ప్రాథమిక విచారణ తర్వాత, జనవరి 8న పోలీసులు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌ను సమర్పించారు. మహారాష్ట్రలో ఒంటెల సంరక్షణకు నిర్దిష్ట చట్టం లేనందున, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం 1960 లోని సెక్షన్ 11 (1)(డి) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇక ఆ తరవాత, 40 ఏళ్లలో ఉన్న ప్రభు రాణా, జగ హీరా, ముసాభాయ్ హమీద్ జాట్ పై, 50 ఏళ్లలో ఉన్న విసాభాయ్ సరావు, 70వ దశకంలో ఉన్న వెర్సిభాయ్ రానా రాబారి పై ఛార్జ్ పెట్టారు.

Four of the traditional herders from Kachchh – Versibhai Rana Rabari, Prabhu Rana Rabari, Visabhai Saravu Rabari and Jaga Hira Rabari (from left to right) – who were arrested along with Musabhai Hamid Jat on January 14 and then released on bail
PHOTO • Jaideep Hardikar

కచ్ఛ్‌కు చెందిన నలుగురు సంప్రదాయ పశువుల కాపరులు - వెర్సిభాయ్ రాణా రాబరి, ప్రభు రాణా రాబారి, విశాభాయ్ సరావు రాబరి, జగ హీరా రాబరీ (ఎడమ నుండి కుడికి) - వీరు జనవరి 14న ముసాభాయ్ హమీద్ జాట్‌తో పాటు అరెస్టు అయి, ఆపై బెయిల్‌పై విడుదలయ్యారు

58 ఒంటెలను పోషించడమే నిజమైన సవాలు అని ఇన్‌స్పెక్టర్ అకరే చెప్పారు. అమరావతిలోని పెద్దవాటిని సంప్రదిస్తూనే,  పోలీసులు సమీపంలోని చిన్న గౌరక్షా కేంద్ర సహాయాన్ని రెండు రాత్రుల పాటు తీసుకున్నారు. అమరావతిలోని దస్తూర్ నగర్ ప్రాంతంలోని కేంద్రం స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది, అక్కడ ఒంటెలను ఉంచడానికి తగినంత స్థలం ఉన్నందున చివరికి వాటిని పంపారు.

హాస్యాస్పదంగా, వాటిని రవాణా చేసే బాధ్యత నిందితుల బంధువుల పైన, వారికి తెలిసిన వారి పైనా పడింది. వారు రెండు రోజుల పాటు తాలెగావ్ దశసర్ నుండి అమరావతి నగరానికి 55 కిలోమీటర్ల దూరం జంతువులను నడిపించి తీసుకువచ్చారు.

పశువుల కాపరులకు మద్దతు వెల్లువెత్తుతోంది. కచ్‌లోని కనీసం మూడు గ్రామ పంచాయతీ లు ఒంటెలను బహిరంగ మేత కోసం విడుదల చేయాలని అమరావతి పోలీసులకు, జిల్లా అధికారులకు విజ్ఞప్తులు పంపాయి. ఈ విజ్ఞప్తులు విఫలమైతే అవి ఆకలితో అలమటించవచ్చు. నాగ్‌పూర్ జిల్లాలోని మకర్ధోకడ గ్రామ పంచాయితీ లో రాబారీలకు పెద్ద డేరా (సెటిల్‌మెంట్) ఉంది, తాము సాంప్రదాయక పశువుల కాపరులమని, ఒంటెలను హైదరాబాద్‌లోని కబేళాకు తరలించడం లేదని ధ్రువపరిచింది. దిగువ కోర్టు ఈ ఒంటెల కస్టడీ పై నిర్ణయం తీసుకుంటుంది: వాటిని ఇక్కడి వరకు తీసుకువచ్చిన నిందితులకు తిరిగి ఇవ్వాలా, లేదా తిరిగి కచ్ఛ్‌కు పంపాలా? అనే విషయం తేలుస్తుంది.

ఈ వ్యక్తులు ఒంటెలను సంప్రదాయంగా కాపాడుకునే వారేనని కోర్టు విశ్వసిస్తుందా లేదా అనే విషయం పైనే తుది ఫలితం ఆధారపడి ఉంటుంది.

*****

మన అజ్ఞానం ఈ సంప్రదాయ పశువుల కాపరులపై అనుమానానికి దారి తీసింది, ఎందుకంటే వారు మనలా కనిపించరు లేదా మాట్లాడరు.
సజల్ కులకర్ణి, పాస్టోరలిస్ట్ కమ్యూనిటీల పరిశోధకుడు, నాగ్‌పూర్

ఈ ఐదుగురు పశువుల కాపరులలో పెద్దవాడైన వెర్సిభాయ్ రానా రాబారి, తన జీవితమంతా ఒంటెలు, గొర్రెల మందలతో దేశంలోని పెద్ద ప్రాంతాలలో కాలినడకన తిరిగాడు, కానీ జంతువుల పట్ల క్రూరత్వానికి పాల్పడినట్లుగా ఇదివరకెన్నడూ ఆరోపించబడలేదు.

"ఇది మొదటిసారి," ముడతలు పడిన ఈ వృద్ధుడు కచ్చి భాషలో అన్నాడు. అతను పోలీసు స్టేషన్‌లోని చెట్టు కింద ఆందోళనగా, సిగ్గుపడుతూ కాళ్లు ముడుచుకుని కూర్చున్నాడు.

Rabaris from Chhattisgarh and other places have been camping in an open shed at the gauraksha kendra in Amravati while waiting for the camels to be freed
PHOTO • Jaideep Hardikar
Rabaris from Chhattisgarh and other places have been camping in an open shed at the gauraksha kendra in Amravati while waiting for the camels to be freed
PHOTO • Jaideep Hardikar

ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన రబారీలు ఒంటెల విడుదల కోసం ఎదురుచూస్తూ అమరావతిలోని గౌరక్షా కేంద్రంలో బహిరంగ షెడ్డులో విడిది చేశారు

"మేము ఈ ఒంటెలను కచ్ఛ్ నుండి మహారాష్ట్ర ఛత్తీస్‌గఢ్‌లో నివసిస్తున్న మా బంధువులకు అందించడానికి తీసుకువచ్చాము," అని ఐదుగురు నిందితులలో ఒకరైన ప్రభు రాణా రాబారి, జనవరి 13న తాలేగావ్ దశసర్ పోలీస్ స్టేషన్‌లో మాకు చెప్పారు. అంటే జనవరి 14న వారిని అధికారికంగా అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేయడానికి ఒక రోజు ముందు.

భుజ్ నుండి, కచ్‌లో గాని, అమరావతికి వెళ్ళే మార్గంలో గాని వారిని ఎవరూ ఆపలేదు. వారిపై ఎవరికీ అనుమానం రాలేదు. ఈ అనూహ్యమైన మలుపుతో వారి గొప్ప ప్రయాణం ఆకస్మికంగా నిలిచిపోయింది.

జంతువులను వార్ధా, నాగ్‌పూర్, భండారా (మహారాష్ట్రలో), ఛత్తీస్‌గఢ్‌లోని రాబరీ స్థావరాలకు కూడా పంపించవలసి ఉంది.

రాబరీ అనేది పాక్షిక సంచార పశుకాపరుల వర్గం. వారు కచ్ఛ్, ఇంకా రాజస్థాన్‌లోని రెండు లేదా మూడు ఇతర సమూహాలతో పాటు, తమ జీవనోపాధికి- గొర్రెలను, మేకలను, వ్యవసాయ పనికి, రవాణా పనులకు - ఒంటెలను పెంచుకుంటారు. కచ్ఛ్ ఒంటె బ్రీడర్స్ అసోసియేషన్ డాక్యుమెంట్ చేసిన ' బయోకల్చరల్ కమ్యూనిటీ ప్రోటోకాల్ 'లో ఇలా చేస్తారు.

సంవత్సరంలో చాలా కాలం పాటు ధేబారియా రాబారి అని ఈ వర్గంలోని ఒక విభాగం, నీటి-మేత సమృద్ధిగా ఉన్న ప్రదేశాలకు చాలా దూరం వలసపోతారు; ఇప్పుడు మధ్య భారతదేశం అంతటా అనేక కుటుంబాలు స్థావరాలు లేదా డేరాలలో సంవత్సరంలో ఎక్కువ కాలం నివసిస్తున్నాయి. వారిలో కొందరు దీపావళి తర్వాత కాలానుగుణంగా వలసపోతారు - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ విదర్భ ప్రాంతాలకు- అంటే కచ్ఛ్ నుండి దూరంగా ఉన్న ప్రాంతాలకు నడుస్తారు.

మధ్య భారతదేశంలో కనీసం 3,000 ధేబారియా రాబరీల నివాసాలు ఉన్నాయని నాగపూర్‌కు చెందిన పశుపోషకులు, సాంప్రదాయ పశుసంరక్షకుల పరిశోధకుడు సజల్ కులకర్ణి చెప్పారు. రెవైటలైజింగ్ రెయిన్‌ఫెడ్ అగ్రికల్చర్ నెట్‌వర్క్ (RRAN)లో ఫెలో అయిన కులకర్ణి, ఒక డేరాలో 5-10 కుటుంబాలు, వారి ఒంటెలు, రాబారీలు మాంసం కోసం పెంచే పెద్ద గొర్రెల, మేకల సమూహాలు ఉండవచ్చని చెప్పారు.

Jakara Rabari and Parbat Rabari (first two from the left), expert herders from Umred in Nagpur district, with their kinsmen in Amravati.They rushed there when they heard about the Kachchhi camels being taken into custody
PHOTO • Jaideep Hardikar

జకరా రాబరీ, పర్బత్ రాబరీ (ఎడమవైపు నుండి మొదటి రెండు), నాగ్‌పూర్ జిల్లాలోని ఉమ్రేడ్‌కు చెందిన నిపుణులైన పశువుల కాపరులు, అమరావతిలో తమ బంధువులతో కలిసి ఉన్నారు. కచ్చి ఒంటెలను అదుపులోకి తీసుకున్న విషయం తెలియగానే వారు అక్కడికి చేరుకున్నారు

కులకర్ణి ఒక దశాబ్దానికి పైగా రబారీలు, వారి పశువుల సంస్కృతులు అని ఈ పశుపోషకుల గురించి అధ్యయనం చేస్తున్నారు. "ఈ సంఘటన పశుపోషకుల గురించి అవగాహన లేకపోవడాన్ని సూచిస్తుంది. మన అజ్ఞానం ఈ సాంప్రదాయ పశువుల కాపరులపై అనుమానానికి దారి తీస్తుంది ఎందుకంటే వారు మనలా కనిపించరు, మాట్లాడరు.” అని వారి అరెస్టు, ఒంటెల 'నిర్బంధం' గురించి అతను చెప్పాడు,

అయినప్పటికీ, రాబరీలలోని కొన్ని సమూహాలు స్థిరపడుతున్నాయని కులకర్ణి చెప్పారు. గుజరాత్‌లో వారు తమ సాంప్రదాయిక పనికి దూరంగా ఉన్నారు, అధికారిక విద్యను అభ్యసిస్తున్నారు, ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. మహారాష్ట్రలోని కొన్ని కుటుంబాలకు ఇప్పుడు ఇక్కడ భూములు కూడా ఉన్నాయి. వీరు స్థానిక రైతులతో సన్నిహితంగా పనిచేస్తున్నారు.

"వారికి, రైతులకు సహజీవన సంబంధం ఉంది" అని కులకర్ణి చెప్పారు. ఉదాహరణకు, 'పెన్నింగ్' - వ్యవసాయం చేయని కాలంలో రబారీలు వ్యవసాయ భూముల్లో తమ గొర్రెలు, మేకల మందలను మేపుకునే ప్రక్రియ. ఇది సేంద్రీయ ఎరువుగా పనిచేసే జంతువుల పెంటలతో నేలలను సుసంపన్నం చేయడానికి సహాయపడుతుంది. "అటువంటి బంధాన్ని పంచుకున్న రైతులకు వారి విలువ తెలుసు," అని ఆయన చెప్పారు.

ఈ 58 ఒంటెలను స్వీకరించాల్సిన రబారీలు మహారాష్ట్ర లేదా ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నారు. వారు దాదాపు తమ జీవితమంతా ఈ రాష్ట్రాలలో స్థిరనివాసాలలో నివసిస్తున్నారు, అలాగే కచ్‌లోని వారి బంధువులతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. మరోవైపు, ఫకీరాణి జాట్‌లు ఎక్కువ దూరం వలస వెళ్లరు, కానీ వీరు అద్భుతమైన ఒంటెల పెంపకందారులు, రబారీలతో సాంస్కృతిక బంధాలను పంచుకుంటారు.

భుజ్‌లోని పాస్టోరలిజం కేంద్రాన్ని నడుపుతున్న NGO సహజీవన్ ప్రకారం, రాబరీ, సామా, ఇంకా జాట్‌లతో సహా కచ్‌లోని అన్ని పశుపోషక సంఘాల నుండి దాదాపు 500 మంది ఒంటెల పెంపకందారులు ఉన్నారు.

"మేము పరిశీలించాము, ఇది నిజం, ఈ 58 యువ ఒంటెలను కచ్ఛ్ ఉంట్ ఉచ్చరక్ మల్ధారి సంగతన్ [కచ్ ఒంటె పెంపకందారుల సంఘం]లోని 11 మంది పెంపకందారుల నుండి కొనుగోలు చేశారు - ఇవి మధ్య భారతదేశంలోని వారి బంధువుల కోసం కొనుగోలు చేయబడ్డాయి," అని సహజీవన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ రమేష్ భట్టి, భుజ్ నుండి ఫోన్‌లో PARIకి చెప్పారు.

ఈ ఐదుగురు కూడా తెలివైన ఒంటె శిక్షకులు. అందుకే ఈ సుదీర్ఘమైన, కష్టమైన, ప్రయాణంలో జంతువులతో పాటు వెళ్లేందుకు వారిని ఎంచుకున్నారని భట్టి మాకు చెప్పారు. వెర్సిభాయ్ బహుశా కచ్‌లోని అత్యంత పురాతనమైన చురుకైన నిపుణులైన శిక్షకులు, ఇంకా రవాణాదారులలో ఒకరు.

Suja Rabari from Chandrapur district (left) and Sajan Rana Rabari from Gadchiroli district (right) were to receive two camels each
PHOTO • Jaideep Hardikar
Suja Rabari from Chandrapur district (left) and Sajan Rana Rabari from Gadchiroli district (right) were to receive two camels each
PHOTO • Jaideep Hardikar

చంద్రాపూర్ జిల్లా (ఎడమ) నుండి సుజ రాబరి, గడ్చిరోలి జిల్లా (కుడి) నుండి సజన్ రానా రాబరీ ఒక్కొక్కరు రెండు ఒంటెలను అందుకోవలసి ఉంది

*****

మాది సంచార సంఘం; చాలా సార్లు మా దగ్గర పత్రాలు ఉండవు...
మష్రుభాయ్ రాబరి, వార్ధా సంఘం నాయకుడు

కచ్ఛ్ నుండి ప్రారంభమైన ఖచ్చితమైన తేదీ వారికి గుర్తులేదు.

"మేము తొమ్మిదవ నెలలో [సెప్టెంబర్ 2021] వివిధ ప్రాంతాల జంతువులను మా పెంపకందారుల నుండి సేకరించడం ప్రారంభించాము. దీపావళి [నవంబర్ ప్రారంభంలో] అవగానే భచౌ(కచ్చ లోని ఒక తాలూకా) నుండి మా నడక ప్రారంభించాము, ఈ సంవత్సరం ఫిబ్రవరి మధ్యలో లేదా చివరిలో ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కి చేరుకుంటాము, అక్కడికే మేము వెళ్ళవలసింది." అని ప్రభు రాణా రాబారి చెప్పారు.

ఈ ఐదుగురు వ్యక్తులు తమ స్వస్థలమైన కచ్ఛ్ నుండి దాదాపు 1,200 కిలోమీటర్లు ప్రయాణించారు. భచౌ నుండి, వారు అహ్మదాబాద్ మీదుగా ప్రయాణించి, తర్వాత మహారాష్ట్రలోని నందుర్బార్, భుసావల్, అకోలా, కరంజా, తలేగావ్ దశసర్ మీదుగా ప్రయాణించారు. వారు వార్ధా, నాగ్‌పూర్, భండారా (మహారాష్ట్రలో కూడా), ఆపై దుర్గ్, రాయ్‌పూర్‌లకు వెళ్లి బిలాస్‌పూర్ (ఈ మూడు ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నాయి) చేరుకునేవారు. వీరు వాషిమ్ జిల్లాలోని కరంజా పట్టణాన్ని తాకిన తర్వాత వారు కొత్తగా నిర్మించిన సమృద్ధి రహదారి వెంట కూడా నడిచారు.

"మేము రోజుకు 12-15 కిలోమీటర్లు నడిచాము, అయితే ఒక చిన్న ఒంటె 20 కిలోమీటర్లు సులభంగా నడవగలదు" అని ముసాభాయ్ హమీద్ జాట్ పేర్కొన్నాడు, బహుశా ఇతనే ఆ ఐదుగురిలో చిన్నవాడు. "మేము రాత్రి ఆగి, ఉదయాన్నే మళ్లీ నడవడం ప్రారంభిస్తాము." వారు తమ కోసం వండుకు తిని, మధ్యాహ్నం కాస్త కునుకు తీసుకొని, ఒంటెలకు కూడా  విశ్రాంతి తీసుకోవడానికి సమయమిచ్చి, మళ్లీ వారి యాత్రను ప్రారంభిస్తారు.

కేవలం ఒంటెలను మేపుతున్నందుకే అరెస్టు అయినందుకు వారు భయపడుతున్నారు.

"మేము మా ఆడ ఒంటెలను ఎప్పుడూ విక్రయించము. రవాణా కోసం మా మగ ఒంటెలను ఉపయోగిస్తాము" అని వార్ధా జిల్లాలో నివసించే ప్రముఖ సంఘం నాయకుడు మష్రుభాయ్ రాబారి మాకు చెప్పారు. "ఒంటెలు మా పాదాలు." ఇప్పుడు 'నిర్బంధంలో' ఉన్న 58 ఒంటెలన్నీ మగవే.

Mashrubhai Rabari (right) has been coordinating between the lawyers, police and family members of the arrested Kachchhi herders. A  community leader from Wardha, Mashrubhai is a crucial link between the Rabari communities scattered across Vidarbha
PHOTO • Jaideep Hardikar
Mashrubhai Rabari (right) has been coordinating between the lawyers, police and family members of the arrested Kachchhi herders. A  community leader from Wardha, Mashrubhai is a crucial link between the Rabari communities scattered across Vidarbha
PHOTO • Jaideep Hardikar

అరెస్టయిన కచ్చి కాపరుల న్యాయవాదులు, పోలీసులు కుటుంబ సభ్యుల మధ్య మష్రుభాయ్ రాబారీ (కుడి) సమన్వయం చేస్తున్నారు. వార్ధాకు చెందిన కమ్యూనిటీ నాయకుడు, మష్రుభాయ్ విదర్భలో చెల్లాచెదురుగా ఉన్న రాబరీ కమ్యూనిటీల మధ్య కీలకమైన లంకె వంటివాడు

‘మష్రూ మామా’ అని ముద్దుగా పిలిపించుకునే ఇతను, ఈ ఐదుగురు పశువుల కాపరులను పోలీసులు పట్టుకున్న రోజు నుంచి వారితోనే ఉంటున్నాడు. వారి కుటుంబ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ, అమరావతిలో న్యాయవాదులకు ఏర్పాట్లు చేస్తూ, పోలీసులకు అనువాదాల్లో సహాయం చేస్తూ, వారి వాంగ్మూలాలను నమోదు చేస్తూ వస్తున్నాడు. అతను మరాఠీ, కచ్చి ఈ రెండు భాషలలోనూ నిష్ణాతుడు. మష్రూ మామా, ఇక్కడ చెల్లాచెదురుగా ఉన్న రాబరీల స్థిరనివాసాల మధ్యనున్న కీలకమైన లంకె.

"ఈ ఒంటెలను విదర్భ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో వివిధ డేరాలలో నివసిస్తున్న మా బంధువులలో 15-16 మందికి పంపిణీ చేయడానికి ఉద్దేశించబడింది" అని మష్రుభాయ్ చెప్పారు. "ప్రతి ఒక్కరికి 3-4 ఒంటెలను అందించాలి." ప్రయాణంలో ఉన్నప్పుడు, రాబరీలు జంతువులతో పాటుగా వారి వస్తువులను, చిన్న పిల్లలను, కొన్నిసార్లు గొర్రె దూడలను - నిజం చెప్పాలంటే వారి ప్రపంచం మొత్తాన్ని మోసుకొస్తారు. మహారాష్ట్రలోని గొర్రెల పెంపక వర్గమైన ధన్‌గర్ వంటి వారిలాగా వీరెప్పుడు ఎద్దుల బండ్లను ఉపయోగించరు.

"మేము ఈ ఒంటెలను మాకు తెలిసిన పెంపకందారుల నుండి కొనుగోలు చేస్తాము," అని మష్రూభాయ్ చెప్పారు. “పెద్ద జంతువుల బదులు ఇక్కడ 10-15 మందికి ఇక్కడ యువ మగ ఒంటెలు అవసరం అయినప్పుడు, మేము మా ఆర్డర్‌లను కచ్‌లోని మా బంధువులకు  చెబుతాము. పెంపకందారులు వాటిని ఒక పెద్ద సంఖ్యలో, శిక్షణ పొందిన వారితో పాటుగా పంపుతారు, వీరికి కొనుగోలుదారులు ఒంటెలను పంపిణీ చేసినందుకు వేతనంగా - ప్రయాణం సుదీర్ఘకాలం ఉంటే నెలకు 6,000 నుండి 7,000 రూపాయల వరకు చెల్లిస్తారు. చిన్న ఒంటె ఖరీదు 10,000 నుండి 20,000 రూపాయల వరకు ఉంటుందని మాష్రూభాయ్ మాకు చెప్పారు. ఒంటె 3 సంవత్సరాల వయస్సులో పనిచేయడం ప్రారంభించి 20-22 సంవత్సరాల వరకు జీవిస్తుందనీ, "ఒక మగ ఒంటె పని జీవితం 15 సంవత్సరాలు," అని అతను చెప్పాడు.

"ఈ వ్యక్తుల వద్ద ఎటువంటి పత్రాలు లేవన్నది నిజమే" అని మష్రూభాయ్ ఒప్పుకున్నాడు. "మాకు ఇంతకు ముందు అవి అవసరం ఉండేవి కావు. అయితే ఇక ముందు నుండి మేము జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. పరిస్థితులు మారుతున్నాయి."

ఈ ఫిర్యాదు, వారిని వారి ఒంటెలను చాలా అనవసరమైన ఇబ్బందులకు గురి చేసిందని అతను చిరాకుపడ్డాడు. " అమీ ఘుమంతు సమాజ్ ఆహే, ఆమ్చ్యా బార్యచ్ లోకాయ్ కడ్ కధీ కధి కాగద్ పత్ర నాస్తే ," అతను మరాఠీలో చెప్పాడు. “మాది సంచార సమాజం; చాలా సార్లు మా వద్ద పత్రాలు ఉండవు [ఇక్కడ జరిగింది అదే]."

Separated from their herders, the animals now languish in the cow shelter, in the custody of people quite clueless when it comes to caring for and feeding them
PHOTO • Jaideep Hardikar
Separated from their herders, the animals now languish in the cow shelter, in the custody of people quite clueless when it comes to caring for and feeding them
PHOTO • Jaideep Hardikar

వాటి పశువుల కాపరుల నుండి వేరు చేయబడిన జంతువులు ఇప్పుడు గోశాలలో, వాటిని సంరక్షించడం, పోషించడం వంటి విషయాలలో ఎటువంటి అవగాహన లేని వ్యక్తుల అదుపులో ఉన్నాయి

*****

వారి పట్ల క్రూరంగా ప్రవర్తించామనేది మాపై వచ్చిన అభియోగం. కానీ బహిరంగ మేత అవసరమైనప్పుడు వాటిని ఇక్కడే పరిమితం చేయడం కంటే గొప్ప క్రూరత్వం మరొకటి లేదు.
పర్బత్ రబారి, నాగ్‌పూర్‌కు చెందిన అనుభవజ్ఞుడైన ఒంటె సంరక్షకుడు

నిర్బంధంలో ఉన్న ఒంటెలన్నీ రెండు నుండి ఐదు సంవత్సరాల మధ్య వయస్సు గలవి. ఇవి కచ్చి జాతికి చెందినవి, సాధారణంగా కచ్ఛ్‌లోని లోతట్టు భూగోళ పర్యావరణ వ్యవస్థలలో ఇవి కనిపిస్తాయి. నేడు కచ్ఛ్‌లో అలాంటి ఒంటెలు 8,000 వరకు ఉన్నాయని అంచనా .

ఈ జాతికి చెందిన మగ ఒంటెలు సాధారణంగా 400 నుండి 600 కిలోల బరువుంటాయి, ఆడ ఒంటెలు 300 నుండి 540 కిలోల మధ్య బరువుంటాయి. సన్నటి ఛాతీ, ఒకే మూపురం, పొడవాటి, వంగిన మెడ; మూపురం, భుజాలు, ఇంకా గొంతుపై పొడవాటి వెంట్రుకలు ఒంటె ముఖ్యమైన లక్షణాలు అని వరల్డ్ అట్లాస్ పేర్కొంది. ఒంటె పైన ఉన్న చర్మపు కోటు రంగు గోధుమ నుండి నలుపు వరకు కొద్దిసార్లు తెలుపు కూడా ఉంటుంది.

గోధుమ రంగులో ఉండే ఈ కచ్చి జాతులు బహిరంగ మేతలను ఇష్టపడతాయి. ఇవి అనేక రకాల మొక్కలను, ఆకు జాతులను తింటాయి. ఇవి అడవుల్లోని చెట్ల నుండి, లేదా పచ్చిక బయళ్లలో, బీడుగా ఉన్న వ్యవసాయ భూముల్లో ఉండే ఆకులను తినవచ్చు.

రాజస్థాన్, గుజరాత్‌లలో ఒంటెల పెంపకం చాలా కష్టంగా మారింది. రెండు రాష్ట్రాల్లో, గత ఒకటి రెండు దశాబ్దాల్లో అడవులు, మడ అడవుల్లోకి ప్రవేశించదానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఒంటెలకు, వాటి పెంపకందారులకు, ఇంకా యజమానులకు, ఆ ప్రాంతం లో ఉన్న సమస్యలకు, ఆ ప్రాంతాలలో జరిగిన అభివృద్ధి స్వభావం కూడా తోడైంది. ఇంతకు ముందు సమృద్ధిగా లభించే ఉచిత మేతను, ఈ జంతువులు ఇప్పుడు కోల్పోయాయి.

ఐదుగురు వ్యక్తులు ఇప్పుడు బెయిల్‌పై ఉన్నారు, అమరావతిలోని పశువుల ఆశ్రమంలో వారి బంధువులతో చేరారు, అక్కడ వారి ఒంటెలను ప్రస్తుతం పెద్ద మైదానంలో బహిరంగ ప్రదేశంలో ఉంచి - చుట్టూ కంచె వేశారు. వాటికి అలవాటైన పశుగ్రాసం దొరకడం లేదని రాబరీలు ఆందోళన చెందుతున్నారు.

A narrow chest, single hump, and a long, curved neck, as well as long hairs on the hump, shoulders and throat are the characteristic features of the Kachchhi breed
PHOTO • Jaideep Hardikar
A narrow chest, single hump, and a long, curved neck, as well as long hairs on the hump, shoulders and throat are the characteristic features of the Kachchhi breed
PHOTO • Jaideep Hardikar

సన్నని ఛాతీ, ఒకే మూపురం, పొడవాటి, వంగిన మెడ, అలాగే మూపురం, భుజాలు, గొంతుపై ఉన్న పొడవాటి వెంట్రుకలు కచ్చి జాతి లక్షణం

ఒంటెలు కచ్ఛ్ (లేదా రాజస్థాన్) నుండి దూరంగా ఉండే ప్రాంతాలకు అలవాటు పడలేవు లేదా నివసించలేవు అనే మాట నిజం కాదు అని రాబరీలు చెబుతారు. భండారా జిల్లాలోని పౌని బ్లాక్‌లోని అస్‌గావ్‌లో నివసించే అనుభవజ్ఞుడైన రాబరీ ఒంటెల సంరక్షకుడు అసాభాయ్ జెసా మాట్లాడుతూ, "అవి చాలా కాలంగా మాతో పాటు ఉంటూ, దేశం అంతటా తిరుగుతున్నాయి.”

నాగ్‌పూర్‌లోని ఉమ్రెడ్ పట్టణానికి సమీపంలోని ఒక గ్రామంలో స్థిరపడిన మరో అనుభవజ్ఞుడైన వలస పశువుల కాపరి, పర్బత్ రబారి, "ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. మేము వారితో క్రూరంగా ప్రవర్తించామనేదే మాపై ఉన్న అభియోగం. కానీ వాటికి బహిరంగ మేత అవసరమైనప్పుడు వాటిని ఇక్కడే పరిమితం చేయడం కంటే గొప్ప క్రూరత్వం మరొకటి లేదు.”

“ఆవులు మేసేవాటిని ఒంటెలు తినవు.” అన్నాడు నాగ్‌పూర్ జిల్లా ఉమ్రేడ్ తాలూకాలోని సిర్సీ అనే గ్రామంలో నివసించే జాకరా రాబరి. జాకరాభాయ్ తన మూడు ఒంటెలను ఈ గోశాల నుండి అందుకోవలసి ఉంది.

కచ్చి ఒంటెలు అనేక రకాల మొక్కలను, ఆకు జాతులను తింటాయి - వేప, బాబుల్, పీపల్, ఇతర రకాలు. కచ్ఛ్‌లో, అవి తమ జిల్లాలోని పొడిగా ఉండే కొండ ప్రాంతాలకు చెందిన చెట్లు ఈ ఒంటెలకు పశుగ్రాసామవుతాయి. ఇవి వాటి పాలలో అసాధారణమైన అధిక పోషక విలువలకు దోహదం చేస్తాయి. ఈ జాతికి చెందిన ఆడ ఒంటె సాధారణంగా రోజుకు 3-4 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. కచ్చి పశువుల కాపరులు ప్రతి రెండో రోజు తమ ఒంటెలను నీటికి వద్దకు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. సాధారణంగా, ఈ జంతువులు వాటికి దాహం వేసినప్పుడు 15 నుండి 20 నిమిషాలలోపు ఒకేసారి 70-80 లీటర్లు ఒకేసారి తాగుతాయి. కానీ నీరు లేకుండా ఎక్కువ కాలం ఉండగలవు.

గౌరక్షా కేంద్రం లో ఉన్న 58 ఒంటెలేవీ ఇప్పటిదాకా పరిమితమైన ప్రదేశంలో దొరికే ఆహారాన్ని దాణాకు ఉపయోగించలేదు. పెద్ద వయస్సున్న జంతువులు ఇక్కడ దొరికే వేరుశెనగ అవశేషాలను తింటాయి, చిన్నవి ఇంకా అలాంటి మేతకు అలవాటు పడలేదని పర్బత్ రబారి చెప్పారు. అమరావతిలోని ఈ ప్రదేశానికి వెళ్లే దారిలో రోడ్డు పక్కన ఉన్న చెట్ల ఆకులనో లేదా పొలం గట్ల వద్ద ఉన్న చెట్ల ఆకులనో ఈ ఒంటెలు తినేవని ఆయన చెప్పారు.

ఒక యువ మగ ఒంటె రోజుకు 30 కిలోల వరకు మేత తింటుందని పర్బత్ మాకు తెలియజేశాడు.

Eating cattle fodder at the cow shelter.
PHOTO • Jaideep Hardikar
A Rabari climbs a neem tree on the premises to cut its branches for leaves, to feed the captive camels
PHOTO • Jaideep Hardikar

ఎడమ: గోశాలవద్ద పశువుల మేత తినడం. కుడివైపు : బందీలుగా ఉన్న ఒంటెలకు ఆహారంగా అందించడం కోసం, ఒక రాబరి, ఆకుల కోయడానికి ఆవరణలోని వేప చెట్టు ఎక్కాడు

ఇక్కడ గోశాలలో పశువులకు అన్ని రకాల పంట అవశేషాలను అందిస్తారు - సోయాబీన్, గోధుమలు, జొన్నలు, మొక్కజొన్న, చిన్న, పెద్ద మినుములు, ఇంకా ఆకుపచ్చ గడ్డి కూడా. నిర్బంధించబడిన ఒంటెలకు కూడా ఇవే ఇస్తున్నారు.

పర్బత్, జాకారా, అనేక దశాబ్దాలుగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో స్థిరపడిన డజను మంది ఇతర రాబారీలు తమ మనుషులను, ఒంటెలను నిర్బందించారని  తెలుసుకుని అమరావతికి వెంటనే వచ్చారు. జంతువుల పై ఆందోళనతో వాటి బాగోగులపై నిఘా ఉంచారు.

“ఒంటెలన్నీ కట్టివేయబడలేదు; కానీ వాటిలో కొన్ని కట్టేసి ఉంచాలి, లేకుంటే అవి  ఒకదాన్నొకటి కొరుకుతాయి లేదా దారినపోయేవారిని ఇబ్బంది పెడతాయి,” అని జాకరా రాబారి చెప్పారు. ఈయన ప్రస్తుతం గౌరక్షా కేంద్ర లో ఒంటెల కస్టడీపై కోర్టు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. "ఈ యువ మగ ఒంటెలు మహా దూకుడుగా ఉంటాయి," అని ఆయన చెప్పారు.

రాబారీలు ఒంటెలను బహిరంగ మేతకు విడుదల చేయాలని పట్టుబట్టారు. గతంలో పోలీసులు ఒంటెలను నిర్బంధించిన సందర్భాలలో, నిర్బంధంలో ఒంటెలు మరణించిన సంఘటనలు ఉన్నాయి.

దిగువ కోర్టులో, వారి స్థానిక న్యాయవాది, మనోజ్ కల్లా, వీలైనంత త్వరగా రాబారీలకు వారి ఒంటెలను తిరిగి అప్పగించాలని కోరుతున్నారు. కచ్ఛ్‌లోని వారి బంధువులు, సంఘంలోని స్థానిక సభ్యులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చే కొనుగోలుదారులు - అందరూ ఈ కేసును ఎదుర్కోవడానికి, న్యాయవాదులకు చెల్లించడానికి, వారి స్వంత బసకు చేరుకోవడానికి, ఒంటెల సరైన మేతకు తమ వనరులను సమకూర్చుకున్నారు.

ఇంతలో, ఒంటెలను గోశాల అదుపులో ఉంచారు.

The 58 dromedaries have been kept in the open, in a large ground that's fenced all around. The Rabaris are worried about their well-being if the case drags on
PHOTO • Jaideep Hardikar
The 58 dromedaries have been kept in the open, in a large ground that's fenced all around. The Rabaris are worried about their well-being if the case drags on
PHOTO • Jaideep Hardikar

చుట్టూ కంచె వేసిన పెద్ద మైదానంలో 58 ఒంటెలను ఉంచారు. కేసు నత్తనడకన సాగితే తమ బాగోగులు ఏమిటని రబారీలు ఆందోళన చెందుతున్నారు

"మొదట్లో మేము వాటిని పోషించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాము, కానీ ఇప్పుడు వాటికి ఎటువంటి మేత, ఎంత మోతాదులో ఇవ్వాలో మాకు తెలుసు - రబారీలు కూడా మాకు సహాయం చేస్తున్నారు" అని పశుసంపదను నిర్వహిస్తున్న అమరావతిలోని గౌరక్షణ సమితి కార్యదర్శి దీపక్ మంత్రి చెప్పారు. "మాకు సమీపంలో 300 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది, అక్కడ నుండి మేము ఒంటెల కోసం పచ్చ, ఎండుతాకులను తీసుకువస్తున్నాము. వాటికి మేత కొరత లేదు," అని ఆయన పేర్కొన్నారు. ఇన్‌హౌస్‌లోని వెటర్నరీ డాక్టర్ల బృందం వచ్చి గాయాలైన కొన్ని ఒంటెలకు చికిత్స అందించింది. "ఇక్కడ వాటికి చూసుకోవడంలో మాకు ఎటువంటి సమస్య లేదు," అని అతను నొక్కి చెప్పాడు.

"ఒంటెలు సరిగ్గా తినడం లేదు," అని పర్బత్ రబారి చెప్పారు. కోర్టు వారి నిర్బంధాన్ని ముగించి, వాటిని తిరిగి వాటి యజమానులకు అప్పగిస్తుందని ఆయన ఆశిస్తున్నారు. "ఇది వాటికి జైలు లాంటిది," అని ఆయన చెప్పారు.

ఇప్పుడు బెయిల్‌పై విడుదలైన వెర్సిభాయ్, ఇంకా ఇతర నలుగురు వ్యక్తులు ఇంటికి వెళ్లాలని ఆత్రుతగా ఉన్నారు కానీ వారి జంతువులను విడుదల చేసి వారి వద్దకు తిరిగి పంపితేనే వెళ్తారు. "జనవరి 21, శుక్రవారం, ధమంగావ్ (దిగువ కోర్టు)లోని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ 58 ఒంటెలపై తమ యాజమాన్యాన్ని నిరూపించడానికి పత్రాలను సమర్పించమని ఐదుగురు పశువుల కాపరులను అడిగారు" అని రాబరీల తరపున వాదిస్తున్న న్యాయవాది మనోజ్ కల్లా PARIకి చెప్పారు. “జంతువులను కొనుగోలు చేసినట్లు చెప్పుకునే వ్యక్తులు ఇచ్చిన రశీదులైనా పర్లేదు."

ఇంతలో, ఈ ఒంటెలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఎదురుచూస్తున్న రబారీలు కూడా తమ బంధువులు, ఒంటెల కొనుగోలుదారులతో కలిసి అమరావతిలోని పశువుల ఆశ్రయంలో విడిది చేస్తున్నారు. అందరి దృష్టి ధామన్‌గావ్ కోర్టుపైనే ఉంది.

ఒంటెలు అర్థంకాని నిర్బంధంలో ఉన్నాయి.

అనువాదం: అపర్ణ తోట

Jaideep Hardikar

Jaideep Hardikar is a Nagpur-based journalist and writer, and a PARI core team member.

Other stories by Jaideep Hardikar
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota